ఆ మధ్య అరిజోనా న్యూ మెక్సికో
ప్రాంతాల్లో తిరుగుతూ చాల చోట్ల చూసిన ఒక బోర్డు, కంపెనీ
నేమ్ గురించి రాశాను. రెడ్షీ ఐస్ అనే ఆ కంపెనీ నాకు చిత్రమనిపించి మీతో
పంచుకున్నాను. దాన్ని చూసినప్పుడు గుర్తుకొచ్చిన దానే మితృడు శివ పేజీలో చూసిన ఈ
ఫోటో మళ్లీ గుర్తు చేసింది.
నాకు పట్నం పరిచయమైందే 16 వ ఏడు (ఎస్సెస్సెల్సీ) తరువాత. అలా
పరిచయమైన పట్నంలో... దాదాపు ప్రతి పట్నంలో కనిపించిన రెండు బోర్డులు... ఎందుకలా
అని నన్ను కాసేపు నిలబెట్టేవి. ఒకటి ‘బ్రాహ్మణ శాకాహార
హోటల్’ అనేది. రెండోది ‘రెడ్డి
మిలిటరి హోటల్’ అనేది. మిలిటరీ అంటే అక్కడ సైనికులు
తింటారని కాదు. మాంసాహార హోటల్ అని దాని అర్థం. మటన్ చికెన్ తో బువ్వ తినాలంటే
రెడ్డి లేక రెడ్ల ‘మిలిటరీ’ హోటల్
కే వెళ్లాలి. తరువాతి రోజుల్లో మిలిటరీ తీసేసి రెడ్డి హోటల్ అని రెడ్డి మాంసాహార
హోటల్ అని బోర్డులు ఉండేవి.
ఈ రెడ్డికీ మాంసాహారానికీ సంబంధం ఏమిటి?
నాకి ఇలా అనిపిస్తున్నది.
ఒకానొక నాడు రాజుల వద్ద స్థిర సైన్యం అనేది లేదు. ఉన్నా చాల కొద్దిగా ఉండే. పరాయి వాడు డండెత్తి వచ్చినా, తామే దండు పోవాలన్నా అప్పటికప్పుడు సాధారణ ప్రజల నుంచి సైన్యాన్ని మొబిలైజ్ చేసుకోవలసిందే. అలా మొబిలైజ్ చేయబడే వారిలో అత్యధికులు. ఊరి నుంచి మొబిలైజ్ చేసే వారిలో మరింత అధికులు ఆ పనినే వృత్తిగా కలిగి ఉండే వారు. శాంతి కాలంలో ఊరి రక్షణ, ఊరిలో శాంతి భద్రతల వంటి పనులు చూసే వారు. రాజుకు పన్నులూ అవీ వసూలు చేసి ఇచ్చే వారు. అలాంటి స్థానికులనే రెడ్డి అని పిలిచే వారు. మొదట వాళ్లు తక్కువ సంఖ్య అయినా తరువాత... ఆ వృత్తి ‘లాభసాటి’ కావడం వల్ల సంతానోత్పత్తి ఎక్కువగా జరిగి చాల ఎక్కువ మంది అయ్యారు. ఒక కులం అయ్యారు. చాల ఉప కులాలు అయ్యారు. మంది ఎక్కువయ్యే కొద్దీ ఒక చోటి నుంచి ఒక చోటికి వలసలు పోయారు. తమ పూర్వీకులు ఎక్కడి నుంచి వచ్చారో తరువాతి వాళ్లకు తలియనంతగా ఆయా స్థలాల్లో తామర తంపరలయ్యారు. (అలా మరిచిపోబడిన పూర్వీకుల గురించి చెప్పే రెడ్డి శాఖ ఒకటుంది. వాళ్లను పిచ్చికుంట్ల రెడ్లు అంటారు. కర్నూలు దగ్గరి ఓబులాపురం గ్రామం తదితర చోట్లి వీరు ఉన్నారని విన్నాను. వెళ్లి కలుసుకోవాలని ఉంది. బద్ధకం. 😊 )
ఈ వలసలు ఎక్కువగా ఏ ప్రాంతం నుంచి జరిగాయో చెప్పడం కష్టం.
విజయ నగర రాజ్య పతనం తరువాత, కాకతీయ రాజ్యపతనం తరువాత విడిపోయి
చెల్లా చెదురైన ఆ రకం అస్థిర సైన్యాలే కొన్ని చోట్ల రెడ్లుగా, కొన్ని చోట్ల వెలమలుగా, కాపులుగా, రెడ్లుగా ‘స్థిర’పడ్డారు.
అంతెందుకు ఈ నాలుగు గుంపుల సామాన్య నామం కాపు అని నా ఆభిప్రాయం. అలా అనుకోడానికి
కారణాలు: 1. చాల చోట్ల ఊళ్లలో ఈ నాలుగు గుపంపుల వాళ్లను... మిగతా ఊరి ‘కాప’దనం అని, కాపులు అని
వ్యవహరిస్తుంది. 2. మా ఊళ్లో టీచరుగా వచ్చిన రామకృష్ణను మా ఊళ్లో ఆ చుట్టు పక్కల
రామకృష్ణా రెడ్డి అనే వారు. 3. నా ఎస్సెస్సెల్సీ సర్టిఫికెట్ లో జయ, మమత సర్టిఫికెట్లలో కూడా కులం పేరు దగ్గర రెడ్డి అని ఉండదు. కాపు అని
ఉంటుంది.
ఎక్కడో చదివాను... విజయనగర రాజ్య చరిత్రకు చెందిన పుస్తకంలో
అనుకుంటాను... రెడ్ల వలసలు కోస్తా వైపు నుంచి జరిగాయని. తిరుపతి వేంకటేశ్వరాలయం
దేవుడు చుట్టు పక్క రైతులకు వ్యవసాయం పనుల కోసం అప్పులు ఇచ్చే వాడు. ఆ విధంగానే
దేవాలయం ప్రసిద్ధమైంది. కృష్ణదేవరాయలు (?) ఆ దేవాలయానికి
మాన్యాలు ఇచ్చాడు ఈ పర్పస్ కోసమే అని నేను చదివాను.
శివా! మీ ఫోటో తో ఇన్ని ఆలోచనలు రేపారు. చాల కృతజ్ఙతలు. మీ
పోస్టులోని ఫోటల్లో హోటల్ నేమ్ బోర్డు నేరుగా ఉన్నవి కూడా ఉన్నాయి. నేను వాటిని
కాకుండా, అద్దంలో ప్రతిబింబంలా అక్షరాలు
తిరుగబడిన బోర్డునే ఎంచుకున్నాను. ఇది సకారణం. మన మన
గతాలకు సంబంధించిన అవగాహనలు మన మనస్సులలో తిరుగబడి ఉన్నాయి. వాటిని సరిగ్గా చదివి, తప్పొప్పులు సరదిద్దుకుని ఆ అనుభవాల నుంచి ఇప్పటికి తగిన పాఠాలు మాత్రం
తీసుకుని, పాత వైషమ్యాలను తుంగలో తొక్కి ముందుకు
నడుద్దాం.
No comments:
Post a Comment